Thursday, 12 October 2023

సామూహిక లలితా సహస్ర నామ పారాయణం మరియు అన్నపూజా మహోత్సవం @ శ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి.

*శ్రీశ్రీశ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం, నందివనపర్తి*

మాతృశక్తికి సాధన ఆహ్వానం

శ్రీశ్రీశ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు -2023

విశేష కార్యక్రమంగా సామూహిక లలితా సహస్రనామ పారాయణం మరియు అన్నపూజ  మహోత్సవం.
తేదీ.17.10.2023, మంగళవారం, ఉ 11 గం.ల నుండి...

లలితా సహస్రనామం ప్రత్యేకత!
  
ఈ సృష్టికి మూలం ఎవరంటే దేవుడని జవాబిస్తారు ఆస్తికులు. మరి ఆ దేవుడికి కూడా ఒక ఆవిర్భావం ఉండాలి కదా! అందుకనే *సృష్టికి మాతృ స్వరూపంగా లలితా అమ్మవారిని భావిస్తారు*. 
*ఆ అమ్మవారి మహత్తుని తలచుకునేందుకు, ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు లలితా సహస్రనామం ఒక గొప్ప సాధనంగా ఎంచుతారు.* నవరాత్రుల సందర్భంగా ఆ లలితా సహస్రనామానికి చెందిన ప్రత్యేకతలు కొన్ని...

- అమ్మవారిని లలితాత్రిపురసుందరిగా పేర్కొంటారు. త్రిపురసుందరి అంటే ముల్లోకాలలలోనూ అందంగా ఉండేది అని అర్థం. 
కానీ త్రిపుర అనే మాటను మూడు కాలాలకు, మూడు స్థితులకు, మూడు శక్తులకూ ప్రతీకగా పేర్కొనవచ్చు. ఉత్తరాదిన ఈ అమ్మవారి ఆరాధన చాలా ప్రముఖంగా ఉండేది. అక్కడి *‘త్రిపుర’ రాష్ట్రానికి అమ్మవారి మీదుగానే ఆ పేరు పెట్టారు.*

- లలితాసహస్రనామం ఆరంభంలోనే ‘ఓం శ్రీమాతా, శ్రీమహారాజ్ఞీ, శ్రీమత్సింహాసనేశ్వరీ’ అనే నామాలు పలకరిస్తాయి. ఈ మూడు నామాలూ కూడా సృష్టిస్థితిలయలకు ప్రతిరూపంగా కనిపిస్తాయి. ఆపై అమ్మవారి వర్ణన, చరిత్ర, మహత్తు అన్నీ క్రమంగా సాగుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది అమ్మవారి పురాణం. ఒక నామం నుంచి మరో నామం ఒక సూత్రంలాగా సాగిపోతుంటాయి.

- చాలా సహస్రనామాలలో పునరుక్తి కనిపిస్తుంది. లలితలో ఒక్క నామం కూడా పునరుక్తి కాకపోవడం విశేషం అంటారు. అంతేకాదు! మరియు, ఇంకా లాంటి ఊతపదాలు కూడా ఇందులో ఉండవు. ఒక్కమాటలో చెప్పాలంటే వ్యాకరణపరంగా కూడా లలితను ఉత్కృష్టమైన స్తోత్రంగా పేర్కొంటారు.

- లలితాసహస్రంలో భండాసుర వధ చాలా ప్రముఖంగా వినిపిస్తుంది. శివుని తపస్సుని భగ్నం చేసే ప్రయత్నంలో, మన్మధుడు కాలిబూడిదైపోయిన కథ తెలిసిందే! ఆ భస్మం నుంచి వెలువడినవాడే భండాసురుడు. ముల్లోకాల మీదా యుద్ధాన్ని ప్రకటించి వణికించిన ఆ భండాసురుడు అమ్మవారి చేతిలో హతం కాక తప్పలేదు. మన్మధుని అవశేషం అయిన భండాసురుని ఇహపరమైన కోరికలకు ప్రతీకగా భావించవచ్చు. అమ్మవారి అనుగ్రహంతో ఆ కోరికను జయించి మోక్షాన్ని సాధించగలమన ఈ స్తోత్రం గుర్తుచేస్తోంది.

- *లలితాసహస్రనామాన్ని చదవాలంటే కొందరు ధ్యానమ్‌, అంగన్యాసమ్‌, కరన్యాసమ్‌, పంచపూజ, ఉత్తరభాగాలను కూడా చదువుతారు. కుదరని పక్షంగా కేవలం సహస్రనామస్తోత్రం వరకూ పఠించినా సరిపోతుంది*. 
ఇక హోమంగానూ, అర్చనగానూ, పారాయణగానూ భక్తులు తమ అభీష్టాన్ని అనుసరించి ఈ స్తోత్రాన్ని పఠించగలగడం మరో ప్రత్యేకత.

- సాధారణంగా ఏదన్నా సహస్రనామంలో ఒకేతరహా ఆరాధనకు ప్రాధాన్యత ఉంటుంది. కానీ లలితాసహస్రంలో సగుణ ఆరాధన, నిర్గుణ ఆరాధన, త్రిమూర్తుల ఉపాసన, కుండలినీ జాగృతి... ఇలా అన్ని రకాల మార్గాలూ కనిపిస్తాయి.

- *అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు సాక్షాత్తు దేవతలే ఈ సహస్రనామాలను పఠించేవారట*. ఆ నామాలను హయగ్రీవుడు, అగస్త్యునికి బోధించగా.... వాటిని వ్యాసుడు బ్రహ్మాండపురాణంలో పొందుపరిచాడు. వ్యాసుని మనం ఆదిగురువుగా భావిస్తాము. ఇక విష్ణుమూర్తికి జ్ఞానస్వరూపమే హయగ్రీవుడు. తమిళురు అగస్త్యుని తొలిసిద్ధునిగా ఆరాధిస్తారు. మరి వీరికే ఆరాధ్యనీయమైన ఈ స్తోత్రం, సామాన్యులకెంత మేలు చేస్తుందో కదా!

- లలిత సహస్రనామం చివరలో ‘శ్రీలలితా రహస్యనామసాహస్ర స్తోత్ర’మని పేర్కొంటారు. అంటే ఇది అర్హులైనవారికి చెప్పాలన్న అర్థం వస్తుంది. ఇందులో పారమార్థికమైన గూఢార్థాలు చాలా ఉన్నాయని మరో అర్థమూ వస్తుంది. *సాధకులకు, ఉపాసకులకు జ్ఞానమార్గాన్ని సూచించే అనేకమైన రహస్యాలు ఇందులో ఉన్నాయని అంటారు.* అమ్మవారి బీజాక్షరాలు, సృస్టిరహస్యాలు, అష్టవిధులు, దశమహావిద్యలకు సంబంధించిన జ్ఞానం ఇందులో నిక్షిప్తమై ఉందని ప్రతీతి.

ఎంత చెప్పుకొన్నా లలిత సహస్రనామా ప్రత్యేకత అంతకంతా మిగిలే ఉంటుంది. ఆ ప్రత్యేకత తెలిసినా తెలియకున్నా... ఆ నామాలను శ్రద్ధగా పఠించినా, విన్నా అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభించి తీరుతుంది.

సామాన్యులు కూడా అమ్మవారి అనుగ్రహం కోసం లలితా సహస్రనామ పారాయణం చేసే విధంగా *శ్రీ జ్ఞానసరస్వతి దేవాలయం ద్వారా శ్రీ విద్యారణ్య స్వామీజీ ఆశీసులతో, ప్రతీ శుక్రవారం సామూహిక పారాయణం Online లో జరుగుతూ 140 వారాలు పూర్తి చేసుకున్నది.*
*అదేవిధంగా చిన్నారులకు కూడా పారాయణం నేర్పించి, సామూహిక పారాయణం జరుగుతున్నది.*
ఆ స్ఫూర్తితో అత్యంత శక్తివంతమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో అందరూ   ప్రత్యక్షంగా సామూహిక లలితా సహస్ర నామ పారాయణం చదవాలనే ఉద్దేశ్యంతో *17.10.2023 రోజున కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఆలయ పరిసర ప్రాంతాలు, భాగ్యనగర్ నుండి సుమారు 516 మంది మాతృ మూర్తులు ఈ పారాయణంలో  పాల్గొనాలి అనే సంకల్పంతో ప్రయత్నం జరిగింది.*  అందుకు తగిన విధంగా ఏర్పాట్లలో ఆలయ సేవా సమితి, మాతృ మండలి నిమగ్నమై ఉన్నది.
ఈ కార్యక్రమానికి మనందరికీ సుపరిచి తురాలైన  *ప్రముఖ సామాజిక,
 ఆధ్యాత్మిక వేత్త శ్రీమతి. భారతీయo సత్యవాణి గారు అతిథిగా పాల్గొని సందేశం ఉంటుంది. 
*అన్నపూజ*:  అన్నo పరబ్రహ్మ స్వరూపం అనేది మనందరికీ తెలిసిన విషయమే..
ఆ విశేషతను ఆచచర దిశగా సాగుతూ ఆలయం ద్వారా గత కొంత కాలంగా *రోజు పిడికెడు బియ్యం*  ఆనే నినాదంతో మాతృమూర్తుల ద్వారా బియ్యం సేకరణ జరిగి అన్నపూజ రోజున ఆలయంలో అందిస్తారు.
అలా సేకరణ జరిగిన బియ్యం అన్న ప్రసాదానికి, అవసరారద్దుల సేవకై అందించబడుతున్నాయి. 
కావున అవకాశం ఉన్న మాతృమూర్తులు, చిన్నారులు ఈ ఉత్సవంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.

భవదీయ.
:~ సదా వెంకట్.
~: *జ్ఞానసరస్వతి సంస్థాన్ & *జ్ఞాన సరస్వతి సేవాసమితి*





No comments:

Post a Comment